వాస్తు పేరుతో సమాజంలో మౌఢ్యం రాజ్యమేలుతుందని, వాస్తు ఫలితాలు చూపి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వాస్తు ఫలితాలలో నిజం ఏమాత్రం లేదని, రావిపూడివారు 'వాస్తువు శాస్త్రమా? ' లో అడుగడునా పలుమార్లు నొక్కిచెప్పారు. ఇలా ఇంతకు ముందే వాస్తు ఫలాలు అబద్దాలని చెప్పిన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు అనేక మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వాస్తు శాస్త్రం అనేది ఒకనాటి భారతీయ నిర్మాణ శాస్త్రం అనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఏమాత్రం సంకోచించ లేదు. కేవలం రావిపూడి వెంకటాద్రి వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సంసిద్దంగా లేరు. ఏ విషయమైనా విమర్శకు గురి అయితేనే దానిలో లోటుపాట్లు బహిర్గతం అవుతాయి. క్రీ.పూ.4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే 16వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. వీరి రచనలను విమర్శించటం ఆనాడు మత ద్రోహం గా భావించేవారు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. ...